వారి పరిస్థితి తలుచుకుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: కేసీఆర్

by Disha Web Desk 2 |
వారి పరిస్థితి తలుచుకుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం మ‌హారాష్ట్రకు చెందిన రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్రణీత్‌తో పాటు పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా రైతులను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. హక్కుల కోసం ఢిల్లీలో ధర్నా చేసిన రైతులపై బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదని, గత ప్రభుత్వాలు తమ ప్రాంత ప్రజలను హింసించాయని, రోజుకు ఐదారుమంది రైతులు చనిపోయే పరిస్థితి ఉండేదని గుర్తుచేసుకున్నారు.

నాడు ఆ రైతుల పరిస్థితి తలుచుకుంటే తన కళ్లలో నీళ్లు తిరిగాయని కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఢిల్లీ ధర్నాలో దాదాపు 750 మంది రైతులు అమరులు అయ్యారని, అయినా చెక్కు చెదరకుండా రైతులు పోరాటం కొనసాగించారని తెలిపారు. ఇప్పటివరకు ప్రధాని వాళ్లకు ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్యక్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్యవ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌ల‌వురు నేత‌లు పాల్గొన్నారు.

Next Story